విజయవాడకు కొత్త సైనిక్ స్కూల్ – ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు
అమరావతి: విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతోంది. జూన్ నెల నుంచి 5,6 తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. విజయవాడ సమీపంలోని కేతనకొండలో నాలుగోది ఏర్పాటు కానుంది. విద్యాభారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూలు పేరుతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ కార్యనిర్వాహక కార్యదర్శి సుధాకర్ రెడ్డి చెప్పారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన బ్రోచర్లను స్థల, భవన దాత చలసాని బాబూ రాజేంద్రప్రసాద్, నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ కార్యదర్శి వాసిరెడ్డి వినోద్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 67 శాతం మందికి స్థానిక కోటా కింద ఈ పాఠశాలల్లో ఇస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు చెప్పారు. ఆరో తరగతిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఆలిండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, బండి సంజయ్ చేతులమీదుగా నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.