హైదరాబాద్లో హైఅలర్ట్,నలుగురు పాకిస్తానీయులకు నోటీసులు
హైదరాబాద్: జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్లో ఉన్నపాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అదేవిధంగా వారి కంప్లీట్ డేటాను కేంద్రానికి పంపితే వారి వీసాల రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్న పాకిస్తానీయులపై తెలంగాణ పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు శనివారం నగరంలో ఉంటున్న నలుగురు పాకిస్థాన్ పౌరులకు నోటీసులు కూడా జారీ చేశారు. వారిని షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లుగా గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ను విడిచి వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ మహా నగరంలో 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లుగా తేలింది. అందులో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు 209 మంది ఉన్నారు. అయితే, లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మాత్రం కేంద్రం మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే.