NH-16 ను కలిపేలా అమరావతి నుంచి మరో నాలుగు రోడ్ల అభివృద్ధి-మంత్రి నారాయణ
CRDA 36వ అధారిటీ సమావేశం..
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్డీయే అధారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది..శుక్రవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ(CRDA) 36వ అధారిటీ సమావేశం జరిగింది.అధారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండగా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్ గా ఉన్నారు.ఆర్థిక శాఖ మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్వీనర్ గా మొత్తం 11 మంది సభ్యులున్నారు.సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో చర్చించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు.
అమరావతి రైతులకు ప్రతి ఏటా ఇచ్చే కౌలుతో పాటు పెన్షన్లను మరో ఐదేళ్లు పొడిగించాలని సీఆర్డీయే అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు..ప్రస్తుతం ఎంత మేర కౌలు అందుతుందో అంతే మేర నగదు,అలాగే ప్రస్తుతం అందుతున్న పెన్షన్ ను రాబోయే ఐదేళ్లకు చెల్లించేందుకు అధారిటీ నిర్ణయం తీసుకుందని చెప్పారు..ఇదే విధంగా ప్రస్తుతం ఇస్తున్న మేరకే పింఛన్లను కూడా వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామన్నారు.మరోవైపు సీఆర్డీయే కు గతంలో మొత్తం 778 మంది ఉద్యోగులు ఉండగా…ప్రస్తుతం కేవలం 249 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. గతంలో మాదిరిగా ఉద్యోగులను నియమించుకునేందుకు అధారిటీ అనుమతి ఇచ్చిందన్నారు…వీటిలో 188 ఉద్యోగాలను నేరుగా 190 ఉద్యోగాలను డిప్యూటేషన్ ద్వారా,75 ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన మరి 67 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు అధారిటీ అనుమతి ఇచ్చిందని మంత్రి తెలిపారు..ఇక గతంలో సీఆర్డీయే కు 47 మంది కన్సల్టెంట్ లు ఉండగా వీరిలో 15 మంది అవసరం పూర్తి కావడంతో కొత్తగా 32 మంది కన్సల్టెంట్స్ నియామకం చేపట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
2019 కు ముందు రాజధాని మాస్టర్ ప్లాన్ లో అనుకున్న విధంగా హెల్త్ సిటీ,స్పోర్ట్స్ సిటీ లాంటి 9 నగరాల నిర్మాణం జరుగుతుందన్నారు.వచ్చే సోమవారం లేదా బుధవారం నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి చెప్పారు..అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.