నెల్లూరు ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సౌకర్యాలు-మంత్రి నారాయణ
నగరంలోని 15 పాఠశాలలతో పాటు..
నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నట్లు రాష్ట్ర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.స్టోన్ హౌస్ పేటలోని ఆర్.ఎస్.ఆర్ పాఠశాల ఆధునీకరణ పనులను గురువారం మంత్రి పరిశీలించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్,పొంగూరు షరణిలతో కలిసి ఉపాధ్యాయులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ ఆర్ లో పాత రేకుల షెడ్ల స్థానంలో 41 గదులతో అత్యాధునిక భవనాలను నిర్మించడమే కాకుండా, నారాయణ విద్యాసంస్థల ఫౌండేషన్ సపోర్ట్తో ప్రభుత్వ స్కూళ్లలోనే కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి తెలిపారు. నగరంలోని 15 స్కూళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
ప్రభుత్వ స్కూళ్లలో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, కష్టపడే విద్యార్థులు ఉన్నారని,వారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తే అద్భుతాలు సాధిస్తారన్నారు.స్కూళ్లలో విద్యా ప్రమాణాలపై నిరంతర నిఘా ఉంచేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా సమీక్షలు జరుగుతాయని, నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ స్కూళ్లను కూడా వేగంగా ఆధునీకరించి ప్రభుత్వ విద్యా రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తామని నారాయణ తెలిపారు.

