ఆంధ్రప్రదేశ్ వేదికగా అమలులోకి వచ్చిన వీబీ జీ రాం జీ
ప్రత్యేక ఆకర్షణగా మ్యాజిక్ డ్రెయిన్..
అమరావతి: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్(VB-G RAM G) చట్టం ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో అమలులోకి వచ్చింది. తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఫారం పాండ్ కు శుంకుస్థాపన చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వీబీ జీ రాం జీ చట్టంలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రజల అభివృద్ధితోపాటు రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని తెలిసేలా ఈ పంట కుంట తవ్వకం పనులకు శ్రీకారం చుట్టారు.
పంచాయతీపాలనలో ఆంధ్రప్రదేశ్ అద్భుత విజయాలు:- అనంతరం వీబీ జీ రాం జీ పథకం కింద కలప ఉత్పత్తి చేసే టేకు, మద్ది, వేప, యూకలిప్టస్ తదితర 10 రకాల మొక్కలను శివరాజ్ సింగ్ చౌహాన్,చంద్రబాబు,పవన్ కళ్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా నాటారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణతోపాటు పంచాయతీల ఆదాయం పెంచేందుకు పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో కలప ఉత్పత్తి, వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రికి తెలియజేశారు.
మ్యాజిక్ డ్రెయిన్:- అనంతరం సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రెయిన్ నమూనాను చూపించి ఆ కాన్సెప్ట్ ను శివరాజ్ సింగ్ చౌహాన్ కి వివరించారు. మురుగునీటి నిర్వహణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న ఆవిష్కరణ అయిన ఈ మ్యాజిక్ డ్రెయిన్ మొత్తం మూడు లేయర్లలో నిర్మాణాన్ని ప్రదర్శించారు.

