నాన్-జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపారాష్ట్రపతి రాధాకృష్ణన్
శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలి- గవర్నర్
మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలి-ముఖ్యమంత్రి
అమరావతి: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరులో నాన్-జీఎంఓ(జన్యుమార్పిడి జరగని మొక్క జొన్న విత్తనాలు) పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ,గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్,ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆవిష్కరించారు. సోమవారం ఏలూరు జిల్లాలోని కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్,విత్తనాన్ని అవిష్కరించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపరాష్ట్రపతి తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నేను తెలుగు అర్థం చేసుకోగలను, కానీ మాట్లాడలేను అని అన్నారు.
కేంద్రం,మహిళా సంఘాలకు రూ.1200 కోట్లు:- రైతులకు వివిధ పథకాలను అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చే పథకానికి కేంద్రం రూ.1200 కోట్లను మహిళా సంఘాలకు కేటాయించిందన్నారు. పాప్ కార్న్ మొక్కజొన్నను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మానేసి, మనమే ఆ దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎనిమిది రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో పాప్ కార్న్ మొక్కజొన్నను పండించడం మామూలు విషయం కాదన్నారు. ఈ ఏడాది దేవుని కృపతో అవసరమైన వర్షాలు కురుస్తాయని.. దాని గురించి ఆందోళన వద్దని చెప్పారు.
నదుల అనుసంధానం జరుగుతుంది:- మహానది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం కలగా మిగలదని.. కొంత ఆలస్యం కావచ్చుగానీ, వాస్తవ రూపం దాల్చుతుందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. మన ఆహార అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఆహార అవసరాలను తీర్చడానికి రైతులకు అవసరమైన సహాయ సహకారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్:- భారతదేశానికి రైతులే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఇతర రంగాల్లో సంక్షోభం ఉన్నా వ్యవసాయం దానిని స్థిరీకరించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో 17 శాతం ఉన్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తలు కరవును తట్టుకునే విత్తనాలపై పరిశోధనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 70 శాతం మొక్కజొన్న ఉత్పత్తులను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని అన్నారు. దీంతో అందుకు సంబంధించిన నగదు మొత్తం ఆయా దేశాలకు వెళ్లేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొత్తం మన దేశ రైతులకు వస్తోందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు:- మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్లు, ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు. దేశంలో తొలి నాన్-GMO పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనం అమల్లోకి రానుంది. ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో.. ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్తులో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని సీఎం చంద్రబాబు తెలిపారు. 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65శాతానికి పెరిగిందని అన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే.. వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు.

