అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు-స్తంభించిన జనజీవనం
ఒక మహిళ గల్లంతు..
అమరావతి: అరుణాచల్ ప్రదేశ్లోని పాపుమ్ పారే జిల్లా, యజాలి సర్కిల్ పరిధిలోని నీకో ప్రాజెక్ట్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన మెరుపు వరదలు వినాశం సృష్టించాయి.ఈ వరదల వల్ల కనీసం 15 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. తీవ్రమైన వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక నిలుపుగోడ కూలిపోవడంతో వరద పరిస్థితి మరింత తీవ్రమైందని అధికారులు తెలిపారు. ఒక మహిళ గల్లంతైనట్లు సమాచారం అందగా, అధికారులు నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నారు.SDRF బృందాలు, NDRF యూనిట్లు, స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మాజీ సైనికులు సహాయక చర్యలలో పాలుపంచుకున్నారు. అస్సాంలోని దిగువ ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. లోతట్టుప్రాంతాలు, నదీ తీరాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

