వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
తూ.గో-ప.గో జిల్లాకలెక్టర్లు పి.ప్రశాంతి,చదలవాడ.నాగరాణిలు..
అమరావతి: రెడ్ క్రాస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేద రోగులకు ఉచితంగా రక్తం అందజేస్తున్నట్టు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖాధ్యక్షులు అబ్దుల్ నజీర్ గురువారం రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన వరల్డ్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ థలసీమియా డే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ 20 బ్లడ్ సెంటర్లను నిర్వహిస్తూ, ప్రతి సంవత్సరం 65,000 పైబడి రక్త యూనిట్లను సేకరిస్తోందని, లక్షకు పైగా యూనిట్లను అవసరమైన నిరుపేదలకు జారీ చేస్తోందని తెలిపారు. వీటిలో మూడొంతులు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ ఉద్యమం కోసం విశేష సేవలు అందించి గరిష్టంగా విరాళాలు సమీకరించిన జిల్లా కలెక్టర్లకు గవర్నర్ అవార్డులు, పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈ అవార్డు తన ఒక్కరి సొంతం కాదని, వరద బాధితుల సహాయార్థం, సహాయం చేసిన ప్రతి ఒక్కరి కృషికి ఇది గుర్తింపు అన్నారు. అవార్డుతో తన బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో కూడా జిల్లా ప్రజల కోసం పూర్తిస్థాయిలో, అంకితభావంతో పనిచేస్తానన్నారు. తూ.గో కలెక్టర్ పి.ప్రశాంతి, కృష్ణా కలెక్టర్ డి.కే.బాలాజీ, నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్, నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి, కాకినాడ కలెక్టర్ సాగిలి షాన్ మోహన్, కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా, బాపట్ల కలెక్టర్ జె. వెంకట మురళిలకు పతకాలు అందుకున్న వారిలో ఉన్నారు.