MSME కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు 90 శాతం వరకు ప్రభుత్వ సాయం-విశ్వ మనోహరన్
ఆగస్టు 15లోగా అందిన అర్హత కలిగిన..
అమరావతి: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తోందని ఏపీ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ CEO విశ్వ మనోహరన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AP-CDP) కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల (CFC) ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం వరకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా MSME క్లస్టర్లకు ఒకే చోట ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ఆధునిక యంత్రాలు, ఇతర అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఏపీ-సీడీపీ కింద సాధారణ కేటగిరీ ప్రాజెక్టులకు ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రత్యేక కేటగిరీ ప్రాజెక్టులకు 90 శాతం వరకు ప్రభుత్వ సాయం లభిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) భరించాల్సి ఉంటుంది.
ఈ పథకం కింద భూమి, భవనం, యంత్రాలు, పరికరాలు, ప్రాజెక్టు ప్రారంభానికి ముందు అయ్యే ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ కోసం మార్జిన్ మనీ వంటి వాటికి ఆర్థిక సాయం పొందవచ్చు. అయితే భూమి, భవనం ఖర్చు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 30 శాతానికి మించకూడదు. MSMEలు తమ ఉత్పత్తులకు మరింత మార్కెట్ను పొందడంతో పాటు ఆధునిక, పర్యావరణహిత సాంకేతికతలను వినియోగించేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
రూ.5 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులను 12 నుంచి 15 నెలల్లో, రూ.5 కోట్లకు పైగా నుంచి రూ.10 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులను 15 నుంచి 18 నెలల్లో పూర్తి చేసేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు విశ్వ మనోహరన్ తెలిపారు. ఆగస్టు 15, 2026లోగా అందిన అర్హత కలిగిన దరఖాస్తులను 60 రోజుల్లో ప్రాసెస్ చేస్తామని చెప్పారు.
రిజిస్టర్డ్ సొసైటీలు, సహకార సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీవోలు), ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు (ఎఫ్పీసీలు), మండల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు), రిజిస్టర్డ్ ఇండస్ట్రీ అసోసియేషన్లు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ ఇండస్ట్రీ అసోసియేషన్లలో కనీసం 200 మంది సభ్యులు ఉండాలి. వారిలో కనీసం 100 మందికి చెల్లుబాటు అయ్యే ఉద్యం రిజిస్ట్రేషన్ ఉండాలి.
దరఖాస్తుదారులు ఉద్యం రిజిస్ట్రేషన్ కలిగిన కనీసం 10 సూక్ష్మ, చిన్న పరిశ్రమలతో ఎస్పీవీ ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 15 సంవత్సరాల కాలానికి భూమి లేదా భవనం అందుబాటులో ఉండాలి. అనంతరం డీపీఆర్ సిద్ధం చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత కలిగిన MSMEలు, పరిశ్రమల సంఘాలు, ఇతర సంస్థలు ఏపీ-సీడీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని విశ్వ మనోహరన్ కోరారు. ఏపీ-సీడీపీ మార్గదర్శకాలు ఏపీ MSME one పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన వారు www.apmsmeone.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరింత సమాచారం, మార్గదర్శకత్వం కోసం సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రాలను (డీఐసీ) సంప్రదించాలని సూచించారు.

