ఢిల్లీలో డీ-రిజిస్టర్ చేసిన వాహనాల కొనుగోలుపై ప్రజలు జాగ్రత్త-RTO మురళీమోహన్ హెచ్చరిక
వాహనాలను స్వాధీనం..
వ్యక్తులపై చట్టపరమైన చర్యలు..
తిరుపతి: ప్రజలు పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో డి-రిజిస్టర్ (De-Registered) చేయబడిన వాహనాలను కొందరు వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు తీసుకువచ్చి, నకిలీ లేదా తప్పుడు పత్రాల ఆధారంగా చట్టబద్ధమైన వాహనాలుగా చూపిస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోందని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. డి-రిజిస్టర్ అయిన ఢిల్లీ వాహనాన్ని,మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు స్వాధీనం చేసుకొని మంగళం డిపోకు తరలించారు. ఇటువంటి వాహనాలను కొనుగోలు చేయడం వల్ల కొనుగోలుదారులు చట్టపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
తిరిగి రిజిస్ట్రేషన్ పొందే అవకాశం ఉండదు:- సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT),సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు ఢిల్లీలో 10 సంవత్సరాలు పూర్తి చేసిన డీజిల్ వాహనాలు,15 సంవత్సరాలు పూర్తి చేసిన పెట్రోల్ వాహనాలు డీ-రిజిస్టర్ చేయబడుతున్నాయి. ఒకసారి అధికారికంగా డీ-రిజిస్టర్ చేసిన వాహనాలకు సాధారణంగా తిరిగి రిజిస్ట్రేషన్ పొందే అవకాశం ఉండదు. అందువల్ల వాహనం కొనుగోలు చేసే ముందు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో లేదా వాహన్ (VAHAN) పోర్టల్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ వివరాలు యాజమాన్య స్థితి,చట్టబద్ధతను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని RTO మురళీమోహన్ తెలియజేశారు.
వాహనాలను స్వాధీనం:- అనుమానాస్పదంగా తక్కువ ధరకు విక్రయించే వాహనాలు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, డి-రిజిస్టర్ చేయబడిన వాహనాలు తనిఖీల్లో గుర్తించబడినట్లైతే మోటార్ వాహనం చట్ట ప్రకారం ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. వాహన కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండి ఇటువంటి అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండాలని రవాణా శాఖ హెచ్చరించింది. వాహనం రిజిస్ట్రేషన్ స్థితిని PARIVAHAN.GOV.IN పోర్టల్ ను ఉపయోగించి సిటిజెన్ లాగిన్ ద్వారా పరిశీలించుకొనవచ్చును. అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), యాజమాన్య వివరాలు, పన్ను చెల్లింపులు,ఇతర పత్రాలను ధ్రువీకరించుకొనవచ్చును. ఢిల్లీ లేదా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పాత వాహనాల విషయంలో సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో నిర్ధారణ చేసుకోవాలని కోరారు.

