అణు,బాలిస్టిక్ క్షిపణులను నిర్మించే సామర్థ్యం ఇరాన్కు ఇకపై లేదు-బెంజమిన్ నెతన్యాహు
అమరావతి: అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు 20 రోజులుగా కొనసాగిన తర్వాత, యురేనియంను అణుబాంబు తయారు చేసే స్థాయికి లేదా బాలిస్టిక్ క్షిపణులను నిర్మించే సామర్థ్యం ఇరాన్కు ఇకపై లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మీడియా సమావేశం వెల్లడించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు అకస్మిక దాడి చేసిన విషయం విదితమే. ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా చిత్తు చేస్తున్నామని, ఆ సామర్థ్యం బూడిదయ్యే వరకు ఆ పనిచేస్తామని నెతన్యూహూ హిబ్రూ భాషలో పేర్కొన్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఇరాన్ చాలా బలహీనంగా తయారైందని ఇదే సమయంలో ప్రాంతీయంగా ఇప్పుడు ఇజ్రాయెల్ శక్తివంతమైందన్నారు.
గత జూన్లో చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్తో ఇరాన్లోని క్షిపణులను ధ్వంసం చేశామని, అణ్వాయుధ కేంద్రాలను కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు. అయితే క్షిపణులకు, న్యూక్లియర్ వెపన్స్ కు అవసరమైన పరికరాలను తయారు చేసే కంపెనీలను ఇప్పుడు ధ్వంసం చేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో దాడులు చేయని రీతిలో ఇప్పుడు ఇరాన్ ఇండస్ట్రియల్ బేస్ను కూల్చుతున్నామన్నారు. అయతుల్లా ఖమేనీతో పాటు అనేక మంది ఇరానీ అగ్రనేతల్ని చంపిన తర్వాత.. ఇప్పుడు ఇరాన్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియదన్నారు. అలీ ఖమేనీ వారసుడిగా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీ ఇప్పుడు వరకు తన ముఖాన్ని చూపలేదన్నారు. త్వరలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లో మార్పు మొదలవుతుందన్నారు.

