పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం-ఉప ముఖ్యమంత్రి చొరవతో..
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకం..
1,111 కిలోమీటర్ల పైప్లైన్..
జల్ జీవన్ మిషన్,అమరజీవి జలధారల కింద రూ.280 కోట్లు..
96 శాతం ఓవరాల్ ప్రాజెక్టు పనులు,,99 శాతం పైప్లైన్ నిర్మాణం పూర్తి..
తుది దశకు నీటి శుద్ధి ప్లాంట్ పనులు..
అమరావతి: జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించి నిర్లక్ష్యం చేసిన పథకాలకు సైతం ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి గాడిలో పెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ.426 కోట్ల విలువైన 96 శాతం పనులు పూర్తి చేసి నిబద్ధత చాటుకున్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం:- ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ. 480 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభమైన పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంలో శ్రద్ధ చూపలేదు. చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ పనుల మీద జరిగిన తొలి సమీక్షలోనే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను సైతం ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. కేంద్రం అంగీకారం తెలపడంతో పులివెందుల మెగా తాగునీటి సరఫరా పథకం తిరిగి ఊపిరి పోసుకుంది.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత:- అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో దాదాపు రూ.280 కోట్లు ఒక్క పులివెందుల పథకానికే కేటాయించి వేగంగా పనులు చేపట్టారు.గత ప్రభుత్వ హయాంలో అరకొర పైప్లైన్లు వేయడం మినహా పెద్దగా పనులేమీ పూర్తి కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 96 శాతం పనులు పూర్తి చేశారు. అందులో పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు ఇప్పటికే ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది. పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తయ్యాయి.
1,111 కిలోమీటర్ల పైప్లైన్:- లింగాల మండలం పరిధిలో 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు అందుతోంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్లైన్కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. కూటమి ప్రభుత్వం తాగు నీరు వంటి ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ చేసిన నిర్దేశం మేరకు పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులను గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

