ఈనెల 27వ తేదీ నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు-మంత్రి ఆనం
నెల్లూరు: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం వెంకటగిరి ఎమ్మేల్యే రామకృష్ణతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అన్ని శాఖలు ముందుగానే సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు:- ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. హనుమంతుని సేవ, గరుడ సేవ, కళ్యాణ ఉత్సవం రోజుల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మాలకొండ, కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు.

