వి ఆర్ సి స్కూల్ నిరుపేదలకు ఉన్నత స్థాయి విద్య అందించటమే ధ్యేయం-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరంలోని నిరుపేదలకు ఉన్నత స్థాయి విద్య అందించటమే ధ్యేయంగా వి ఆర్ సి స్కూల్ ను పునః ప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నారాయణ వి ఆర్ సి పాఠశాల పునర్నిర్మాణపనులను కమిషనర్ నందన్ తో కలిసి పరిశీలించారు. అన్ని తరగతి గదులను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆటపాటలకు అనుకూలంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి పాత శిధిలమైన భవనాలను తొలగించి మైదానాన్ని నిర్మించాలని ఆదేశించామన్నారు. నెల్లూరు నగర నడిబొడ్డులో మూడు షిఫ్టుల్లో 8 వేలకు పైగా విద్యార్థులు చదువుకున్న ప్రతిష్టాత్మక కాలేజీని గత ప్రభుత్వ నిర్వాహకులు నిర్వీర్యం చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాఠశాల ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నగరంలోని పేదలు, నిరుపేదలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తామన్నారు. పునర్నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అన్ని పనులు అనుకున్న విధంగా పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభించే నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామన్నారు. మొదటి సంవత్సరంలో వేయి మంది పేదలకు అడ్మిషన్స్ కల్పిస్తామని, ఉచిత బస్సు, భోజన వసతితో పాటు సాయంకాలం ఆటపాటల అనంతరం స్నాక్స్ అందించి వారి ఇళ్ల వద్ద దించుతామన్నారు. ఆవిధంగా వచ్చే విద్యా సంవత్సరం పేదల అడ్మిషన్లు రెండు వేలకు పెంచుతామన్నారు.