పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టండి-కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక 2 వ డివిజన్ సిరి గార్డెన్, నరుకూరు సెంటర్, గుడిపల్లిపాడు, బృందావనం గార్డెన్స్ తదితర ప్రాంతంలో పర్యటించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజను వ్యాప్తంగా ప్రధాన డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత క్రమం తప్పకుండా జరపాలని సూచించారు. అవసరమైన అన్నిప్రాంతాల్లో డ్రైను కాలువల నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.డివిజన్ పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఖాళీ స్థలాల పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రి రోడ్లను ఆక్రమించకుండా వార్డు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రి వీధులకు అంతరాయం కల్పిస్తూ ఉంటే వారి నుంచి జరిమానా వసూలు చేయాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతుల ప్రకారం మాత్రమే కట్టుబడి జరిగేలా పర్యవేక్షించాలని అనుమతులు లేని అదనపు నిర్మాణాలు జరుగుతుంటే, ఆయా నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామ్ మోహన్, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.