జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు-మే 5 నుంచి నీటి విడుదలకు చర్యలు- మంత్రి ఆనం
41 టీఎంసీలు నీరు కేటాయింపు-ఐఎబీ
నెల్లూరు: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ (IAB) సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహామండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు.
నీటిని పొదుపుగా రబీ పంట:- జిల్లాలో ప్రస్తుతం సోమశిల జలాశయం పరిధిలో 52.653 టిఎంసీల నీటినిల్వ, కనిగిరి-సర్వేపల్లి రిజరాయర్లలో 3.615 టిఎంసిల నీటి నిల్వ కలిపి మొత్తం 56.268 టిఎంసిల నీటినిల్వలో డెడ్ స్టోరేజి 7,500టిఎంసిలు, నీటి ఆవిరి 1500 టిఎంసిలు, నెల్లూరు కార్పొరేషన్, కావలి, అల్లూరు, ఆత్మకూరు తదితర పట్టణాల తాగునీటి అవసరాలకు 3,500 టిఎంసిలు మొత్తం 12.500 టిఎంసిల నీరు మినహాయించగా 43.768 టిఎంసిల నీటి లభ్యత ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇందులో సుమారు 36 టిఎంసిల వరకు నీటిని పొదుపుగా రబీ పంట సాగునీటి అవసరాలకు వినియోగించుకుని 10టిఎంసిల నీటిని భవిష్యత్ అవసరాలు, రాబోయే ఖరీఫ్ పంట కోసం నీటిని నిల్వచేసుకునేలా ప్రణాళికాబద్దంగా నీటిని వాడుకునేందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఈ నీటి లభ్యత ఆధారంగా పెన్నా డెల్టా ఆయకట్టుకు 2లక్షల ఎకరాలకు, కనుపూరు కాలువ 25వేల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కాలువ కింద 1.44లక్షల ఎకరాలు మొత్తం 3.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు 43.42 టిఎంసిల నీటి కేటాయింపును అధికారులు ప్రతిపాదించగా, ఐఎబీ సమావేశంలో ఎమ్మెల్యేలు, నీటి సంఘాల అధ్యక్షులు అందరి ఆమోదం మేరకు రెండో పంట రబీకి సుమారు 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయించాలని తీర్మానించినట్లు చెప్పారు.
ఈ సమావేశానికి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ, నీటిసంఘాల అధ్యక్షులు, రైతుసంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.