బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తే జరిమానాలు విధించండి- కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా నిర్వహించే క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పారిశుద్ధ్య విభాగంతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమర్షియల్ ప్రాంతాల్లోని కార్యదర్శులు వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్న వారిని గుర్తించి ఎక్కువ సంఖ్యలో జరిమానాలు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి వదిలేంతవరకు క్రమం తప్పకుండా జరిమానాలను విధిస్తూనే ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత డివిజన్లలోని కార్యదర్శులు, సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
కాలువల్లో పూడికతీత:- అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను, సిల్ట్ తొలగింపు పనులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. పరిసరాల పరిశుభ్రత కోసం నగర పాలక సంస్థలో అందుబాటులో ఉన్న అన్ని వాహనాలు, యంత్రాలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో వినియోగించుకుని చక్కటి ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, డి.ఈ సాయిరాం, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.