రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ
నెల్లూరు(జి) గూడూరులో 45.8°C,
అమరావతి: దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా పిడుగులతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు వెల్లడించారు.
గురువారం నెల్లూరు(జి) గూడూరులో 45.8°C, పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.2°C, మార్కాపురం(జి) నందనమారెళ్ళలో 45°C, తిరుపతి(జి) రాయలచెరువులో 44.3°C, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడు, ప్రకాశం(జి) వలేటివారిపాలెంలో 43.6°C, బాపట్ల(జి) కారంచేడు, చిత్తూరు(జి) తవణంపల్లెలో 43.5°C, , నంద్యాల(జి) సంజామలలో 43.2°C, వైఎస్సార్ కడప (జి) కోడూరులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ లో అంతర్గత మహారాష్ట్ర సహా దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ద్రొణి కారణంగా రానున్న మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

