భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్-సీ.ఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్, స్కైరూట్ సంస్థకు చెందిన విక్రమ్-1ను శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి తరలించే వాహనానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రాకెట్ ప్రయాణ సమయంలో దాని లోపల ఉన్న ఉపగ్రహాలను రక్షించే నిర్మాణమైన, అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పేలోడ్ ఫెయిరింగ్ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ, ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం, భారతదేశపు వర్ధమాన ప్రైవేటు అంతరిక్ష సాంకేతిక రంగానికి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
3డి-ప్రింటెడ్ ఇంజన్లు:- విక్రమ్-1 అనేది 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన ఒక బహుళ-దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. ఏడు అంతస్తుల ఎత్తులో ఉండే ఈ రాకెట్ ను పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించారు.3డి-ప్రింటెడ్ ఇంజన్లు-అధిక-థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లతో సహా, సంస్థలోపలనే అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్ల ద్వారా ఇది శక్తిని పొందుతుంది. త్వరలో చేయబోయే ఈ ప్రయోగం, విక్రమ్-1 మిషన్లలో మొదటిది. శ్రీహరికోటలో ఇంటిగ్రేషన్ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత, రాబోయే నెలల్లో ఈ ప్రయోగం జరగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం-శాసన వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

