తెలుగు ప్రజలందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు-సీ.ఎం చంద్రబాబు
మీకు,మీ కుటుంబ సభ్యులకు తెలుగు సంవత్సరాది ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల్లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని వివరించారు.తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు సంస్కృతి వినూత్నమైనది, పండుగలు విభిన్నమైనవి, ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత ఉందని,మన పండుగలు ఆరోగ్యకర జీవన శైలిని ప్రతిబింబిస్తాయని, నేల, ప్రకృతి, నీటిని పూజిస్తామని చెప్పారు. మూడవ సారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఈ సంవత్సరం 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని.. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

