అనుమతులను అతిక్రమిస్తే నిర్మాణాలను తొలగిస్తాం- కమిషనర్ వై.ఓ నందన్
జేమ్స్ గార్డెన్ లో మూడు భవనాల కూల్చివేత..
నెల్లూరు: నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ నందన్ హెచ్చరించారు.నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులను నిర్మించిన స్థానిక వెంకటరామాపురం, జేమ్స్ గార్డెన్ ప్రాంతంలోని మూడు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది బుధవారం తొలగించారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపుకు గతంలోనే నోటీసులు జారీ చేసి డెమోలిషన్ ఆర్డర్స్ ను కూడా యజమానులకు అందజేశామని కమిషనర్ తెలిపారు. భవనాల యజమానులు కొంత గడువు కోరి స్వయంగా అనధికార నిర్మాణాలని తొలగించుకుంటామని ప్రకటించి, నిర్దేశించిన సమయానికి తొలగించకపోవడంతో టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అదనపు అంతస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం మార్గదర్శకాలలో భవన నిర్మాణ యజమానుల సౌలభ్యం దృష్ట్యా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, వాటిని సద్వినియోగం చేసుకొని నిర్మాణాలను చేపట్టాలని కమిషనర్ సూచించారు. అనధికార కట్టడాలు, అనుమతులు ఆక్రమించిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితులను తొలగించి వేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

