అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ-ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల మేర ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం కార్మికశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలను, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వేర్వేరు సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు దేశ విదేశాల్లోని ఉపాధి అవకాశాలను దక్కించుకుని అధిక ఆదాయాన్ని ఆర్జించేలా చూడాలని సూచించారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటా బేస్ ను రూపొందించాలని.. వారిలో నైపుణ్యాల స్థాయిని అంచనా వేయాలని ముఖ్యమంత్రి కార్మిక శాఖకు నిర్దేశించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటా బేస్ ను అనుసంధానించటంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు గణనీయంగా పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
20 లక్షల మంది కార్మికులకు:- సిమ్యులేషన్ ల్యాబ్స్ సహా ఆధునిక శిక్షణ నైపుణ్యాల ద్వారా ఉత్పాదకత పెంచే అంశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. వివిధ రంగాలకు అవసరమైన ఆధునిక పనిముట్లను కూడా కార్మికులకు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఏపీలో ఉన్న కార్మికుల్లో సాంకేతిక పరమైన నైపుణ్యాలు పెరిగితే అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్కిల్డ్ లేబర్ ను తయారు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న వివిధ భారీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా మన యువతకు అవసరమని ఆయన అన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులను మైక్రో ఎంట్రప్రెన్యూర్లగానూ ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించాలన్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ తో పాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు ఆపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు. గతంలో కార్మికుల సంక్షేమం కోసం కనస్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ ఫండ్ను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కార్మికుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆ శాఖ కార్యదర్శి ఎం.వి. శేషగిరి బాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

