ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ-సీఎం చంద్రబాబు
ఆదాయాలు-బకాయిల లెక్కలు తేల్చండి-డిప్యూటీ సీఎం..
అమరావతి: స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెనకబడిన, తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్టసవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్ధిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ధిక సంఘం సిఫారుసులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్ధిక-ఆర్ధికేతర అంశాలపై ఆర్ధిక సంఘం సిఫార్సులు చేసింది.
స్థానిక సంస్థల స్వయం సమృద్ధే లక్ష్యంగా:-
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలి. పంచాయతీల నిర్వహణకు ఏ మేరకు అవసరాలు ఉన్నాయో గుర్తించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏ విధంగా సాయం అందించాలి…? స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి…? అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలు కలుగుతుంది. ఉపాధి హామీ పధకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అయితే ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో, లేదో అనే విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు ప్రయత్నించాలి. ఆర్ధిక సంవత్సరం చివరికి పంచాయతీల్లోనూ, పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ ఆడిటింగ్ పూర్తి చేయాలి.’ అన్నారు.
పవన్ కళ్యాణ్- ఆదాయాలు-బకాయిల లెక్కలు తేల్చండి:-
2019 నుంచి 2024 మధ్య కాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూళ్లు ఎంత జరిగాయి…? ఇంకెంత బకాయిలు ఉన్నాయో…? లెక్కలు తేల్చాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతీది ఆన్లైన్ చేయాలని నిర్దేశించారు. గ్రామాల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పారు. గ్రామ ప్రజలకు, పౌల్ట్రీ పరిశ్రమలకు ఇబ్బందిలేని విధానాన్ని తీసుకురావాలన్నారు.