లండన్,దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ..
అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించే పలు ప్రాజెక్టుల అధ్యయనానికి పురపాలకశాఖ మంత్రి నారాయణ విదేశీ పర్యటనకు వెళ్ళారు..ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలో టాప్ 5 రాజధానులలో ఒకటిగా నిర్మించేందుకు అందుకు తగినట్లుగానే మాస్టర్ ప్లాన్ రూపకల్పనతో పాటు కీలక ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనేక దేశాల్లో అధ్యయనం చేస్తున్నారు…దీనికోసం మంత్రి నారాయణతో పాటు అధికారులు పలు దేశాల్లో ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులను,ప్రాంతాలను పరిశీలించి బెస్ట్ మోడల్స్ ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మించే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ,టూరిజం ప్రాజెక్టుల అధ్యయనానికి యూకేలోని లండన్,ఖతార్ రాజధాని దోహాలో పర్యటించారు.ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
థేమ్స్ నది ఒడ్డున:- రెండు రోజులపాటు లండన్ లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం…సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై లండన్ అభివృద్ధి ప్రణాళికలు,టూరిజం ప్రాజెక్టులపై చర్చించారు.. థేమ్స్ నది ఒడ్డున అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రివర్ ఫ్రంట్ ను పరిశీలించారు…కృష్ణా నదీ తీరాన రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి థేమ్స్ రివర్ ఫ్రంట్ ను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.

దోహా స్పోర్ట్స్ సిటీని మంత్రి బృందం:- లండన్ నుంచి నేరుగా ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్న మంత్రి నారాయణ బృందం…అక్కడి స్పోర్ట్స్ ప్రాజెక్టులను సందర్శించింది.ఆస్పైర్ జోన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా పిలిచే దోహా స్పోర్ట్స్ సిటీని మంత్రి బృందం సందర్శించింది.స్పోర్ట్స్ సిటీలోని ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం,ఆస్పిటర్ స్పోర్ట్స్ హాస్పిటల్,ఆస్పైర్ అకాడమీలను పరిశీలించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తుంది. మూడు రోజుల పర్యటన ముగించుకుని భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం మంత్రి నారాయణ బృందం విజయవాడ చేరుకోనుంది.

