48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం -విపత్తుల నిర్వహణ సంస్థ
29 నుంచి డిసెంబర్ 2 వరకు..
అమరావతి: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాబోయే 6 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్, నైరుతి బంగాళాఖాతం,శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని వివరించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. వేటకువెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది.రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

