గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ-ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
‘అడవితల్లి బాట’ పనులను…
అమరావతి: గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రహదారి సౌకర్యం లేని గిరిజన:- అధికారులు ఈ పనుల పురోగతిని వివరిస్తూ పనులు వేగంగా చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను, అవరోధాలను అధికారులు తెలిపారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేసేందుకు బండరాళ్లను బద్ధలుకొడుతూ ముందుకు వెళ్ళేందుకు అధిక సమయం తీసుకొంటోందని తెలిపారు. అదే విధంగా నిటారుగా ఉన్న ప్రాంతాలు కావడంతో రోడ్ల నిర్మాణంలో పలు జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండటంతో పనుల వేగం తగ్గింద్దని వివరించారు.128 రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడం వల్ల అటవీ అనుమతులు కోరగా ఇప్పటికే 98 రోడ్లకు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 186 పనులు చేపట్టగా, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి రోడ్డు సౌకర్యం పొందే ఆవాసాలు కూడా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనుల గురించి స్థానికులకు కూడా తెలియచేయడం ఎంతో అవసరం. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని చెప్పాలి. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని ఉపముఖ్యమంత్రి అన్నారు.