AP&TG

సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్-సీఎం చంద్రబాబు

షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు..

అమరావతి: ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను ఈ కార్పోరేషన్ ద్వారానే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ఎయిర్ పోర్టులు-పోర్టుల అభివృద్ధి, మారిటైం పాలసీలో తీసుకురావాల్సిన మార్పులు, లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాం. ఆపరేషనల్గా ఉన్న పోర్టులు, ఎయిర్ పోర్టుల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయి.

మౌలిక సదుపాయాల చోదక శక్తిగా లాజిస్టిక్స్ కార్పోరేషన్:- “రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను సమర్ధంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి. పోర్టులు, ఎయిర్ పోర్టుల సమీపంలో శాటిలైట్ టౌన్ షిప్పుల అభివృద్ధికి అవసరమైన సంస్థలను గుర్తించి పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలి. లాజిస్టిక్ కార్పోరేషన్ అనేది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ మాదిరిగా ఉండాలి. ఇదే తరహాలో 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకుంటున్న ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద కూడా శాటిలైట్ టౌన్ షిప్పులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయాలి. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి భూసేకరణ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలి. ఈ ఎయిర్ పోర్టులను నేషనల్ హైవేలను కలిపేలా అంతర్గత రోడ్ల నిర్మాణం ఉండాలి. అవసరమైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా దీనిని చేపట్టాలి.” అని సీఎం చెప్పారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు మారిటైం పాలసీలో మార్పులు:- పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మారిటైమ్ విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. పోర్టులు, టెర్మినల్స్, షిప్ బిల్డింగ్ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్ టెర్మినళ్ల ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్కీం పాలసీకి అనుగుణంగా మారిటైం పాలసీలో మార్పులు చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఈ మేరకు అవసరమైన మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. అలాగే షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం కోసం మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *