సిఎంతో మాట్లాడి నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యల్ని పరిష్కరిస్తా- ఎన్టీఆర్ వైద్య సేవల్ని ఆపొద్దు-మంత్రి
5-
వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్…
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విజయవాడలో గురువారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ “సేవల్ని ఆపొద్దని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోచ్చేనాటికి దాదాపు రూ. 2,500 కోట్ల మేర బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయిందని అన్నారు.
రూ.3,800 కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం చెల్లించింది. రూ. 670 కోట్ల వరకు అధికారులు అప్లోడ్ చేశారు.మరో రూ.2,000 కోట్లు స్క్రూటినీలో ఉన్నాయి. నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను నిరంతరం సంప్రదిస్తున్నాం. ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటున్నారు. పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవలందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఆసుపత్రి నడపడం అసాధ్యం అనే విషయం మాకు కూడా తెలుసు. ఇటివలే మరో రూ.250 కోట్లు విడుదల చేశాం. నెట్వర్క్ ఆసుపత్రుల సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ప్రజారోగ్యం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అనేక కష్టాలను, ఒత్తిళ్లను తట్టుకుంటూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి వారికి పూర్తి సహకారం ఉంటుంది. గత ప్రభుత్వం పూర్తిగా ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయల కారణంగా ఈ ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. సేవల్ని ఆపొద్దు అని కోరుతున్నాం ” అని మంత్రి కోరారు.