AP&TGHEALTHOTHERS

డిసిహెచ్ య‌స్‌ల ప‌నితీరులో మార్పు రావాలి-మంత్రి స‌త్య‌కుమార్

సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు త‌గ్గాలి..

అమరావతి: జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారుల (DCHS) ప‌నితీరులో మార్పురావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. రెండు నెల‌ల క్రితం DCHSలు,DMHOల‌ స‌మీక్షా స‌మావేశంలో ప‌లు కీల‌కాంశాల్ని గ‌మ‌నించాన‌ని, వాటిని స‌రిచేసేందుకు శిక్ష‌ణివ్వాల‌ని భావించామ‌ని మంత్రి తెలిపారు.తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో 26 జిల్లాల DCHS ల‌కు నాలుగు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారంనాడు మంత్రి ప్రారంభించారు. సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ రూపొందించిన సమగ్ర యాప్ ను మంత్రి ఆవిష్క‌రించారు. DCHS ల‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ అవినీతిని ఏమాత్రం స‌హించేదిలేద‌న్నారు. సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లను బాగా తగ్గించాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ప్రిఆథ‌రైజేష‌న్లు పెంచాలి:- సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, ప్రిఆథ‌రైజేష‌న్లు పెంచాల‌ని మంత్రి ఆదేశించారు. గ‌తేడాది జూన్‌లో 15 శాత‌మున్న ప్రిఆథ‌రైజేష‌న్లు ఈ ఏడాది జూన్ నాటికి 24 శాతానికి పెరిగాయ‌ని, దీన్ని 80 శాతానికి పెంచేందుకు కృషి చేయాల‌న్నారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో 80 నుంచి 90 శాతం మేర ప్రిఆథ‌రైజేష‌న్లు జ‌రుగుతున్నాయ‌ని, సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో కూడా ఇదే స్థాయిలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్రిఆథ‌రైజేష‌న్ల విష‌యంలో సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్‌, DCHSలు సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. అలాగే సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో 41 శాతం మేర సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లు న‌మోద‌య్యాయ‌ని, వీటిని త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

15,000 మంది డాక్ట‌ర్లు ప్ర‌జారోగ్య రంగంలో:- కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చిన ఏడాదిలో సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాల్ని ఆశించిన మేర క‌ల్పించామ‌ని, 90 ఆసుప‌త్రుల్లో అల్ట్రా సోనోగ్ర‌ఫీ(USG) స‌ర్వీసుల్ని క‌ల్పించామ‌ని, 149 ఎక్స్‌ రే యంత్రాల్ని ఏర్పాటు చేశామ‌ని, 89 ఆసుప‌త్రుల్లో టెలీరేడియాల‌జీ స‌ర్వీసుల్ని క‌ల్పించామ‌ని, 20 కొత్త డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను నెల‌కొల్పామ‌ని మంత్రి తెలిపారు. 13 కొత్త ఇంటిగ్రేటెడ్ ప‌బ్లిక్ హెల్త్ ల్యాబ‌రెట‌రీల‌ను(IPHL) ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌తి IPHL ల్యాబ్‌లో 139 డ‌యాగ్న‌స్టిక్ టెస్టులు చేస్తున్నార‌ని మంత్రి చెప్పారు. దాదాపు 15,000 మంది డాక్ట‌ర్లు ప్ర‌జారోగ్య రంగంలో సేవ‌లందిస్తున్నార‌ని, వీరిలో DCHSలు,DMHOలలు, స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్లు ఉన్నార‌ని, పాల‌నాప‌ర‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న వారు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్ని పెంపొందించుకోవాల‌ని మంత్రి సూచించారు.

ముఖ్య‌మంత్రి IVRS విధానాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో సేవ‌ల‌పై ప్ర‌జాభిప్రాయాల్ని తెలుసుకునే వీలు క‌లిగింద‌న్నారు. 61 శాతం నుంచి 40 శాతానికి అవినీతి త‌గ్గింద‌ని IVRS ద్వారా తెలిసింద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ప్ర‌జారోగ్య రంగంలో ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని క‌లిగించ‌గ‌లిగామ‌న్నారు. గ‌తంలో సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో 60 శాతం హాజ‌రు శాతం ఉండేద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకొచ్చాక ఇది 84 శాతానికి పెరిగింద‌ని, దీన్ని 95 శాతానికి పెంచ‌గ‌లిగితే పూర్తి స్థాయిలో సేవ‌లందించిన‌వార‌మ‌వుతామ‌ని మంత్రి తెలిపారు. 242 సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో వివిధ స్థాయిల్లో 12,779 సిబ్బంది ఉండాల్సి ఉండ‌గా, 1,803  పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఏడాదిలో 462 మంది డాక్ట‌ర్ల‌ను నియ‌మించామ‌ని మంత్రి తెలిపారు. రోజుకు ఒక ల‌క్ష ఓపీ సేవ‌లు:- 2024-25లో 2.41 కోట్ల మేర ఓపీ సేవ‌లు న‌మోద‌య్యాయ‌ని, అంటే రోజుకు ఒక ల‌క్ష ఓపీ సేవ‌లు న‌మోద‌య్యాయ‌ని మంత్రి తెలిపారు. 2047 నాటికి స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ డాక్ట‌ర్లు భాగ‌స్వాముల‌వ్వాల‌ని, ఇందుకోసం అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల‌ని  మంత్రి స‌త్య‌కుమార్ కోరారు. సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *