త్వరలో దగదర్తి విమానాశ్రయం పనులు చేపడతం-సీఎం చంద్రబాబు నాయుడు
నెల్లూరు: ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పాలకుల నిర్వాకంతో భవన నిర్మాన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. మే డే సందర్భంగా నెల్లూరు జిల్లా నారంపేటతో పాటు మరో 10 చోట్ల MSME పార్కులు ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఇన్నోవేషన్ హబ్ గా అమరావతి:-త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆనాడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏఐ ని ప్రోత్సహిస్తున్నాను. భవిష్యత్ ఏఐదే . దాన్ని ఉపయోగించుకుంటే జీవితాలు బాగుపడతాయి. ఉత్తరాంధ్రకు విశాఖ కేంద్రంగా గోదావరి జిల్లాలకు రాజమండ్రి కేంద్రంగా, గుంటూరు, కృష్ణా జిల్లాలకు విజయవాడ కేంద్రంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తిరుపతి కేంద్రంగా, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు అనంతపురం కేంద్రంగా రీజనల్ హబ్స్ పెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారే ఉన్నత స్థితి లో ఉన్నారు. ఉద్యోగం చేయడం కాదు…ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి రావాలి.
నెల్లూరు జిల్లా అభివృద్ధి బాధ్యత నాది:-నెల్లూరు జిల్లాలో తరతరాలుగా పేదరికంలోనే యానాదులు మగ్గుతున్నారు. వారిని ఆదుకుంటాం. సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం. రామాయపట్నంలో రూ. 95 వేల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. కావలి పక్కన దగదర్తి ఎయిర్ పోర్టు త్వరలో ప్రారంభిస్తాం. శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రూ. 5 వేల కోట్ల వ్యయంతో ఎల్ జీ వస్తోంది. 10 వేల ఉద్యోగాలు కల్పిస్తారు. సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారుచేస్తాం. శ్రీశైలం నుంచి నీటిని ముందుగా సీమకు ఇచ్చింది ఎన్టీఆరే. సోమశిల , కందలేరుకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆత్మకూరులో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం.