యువత కోసం ‘సేనతో సేనాని-మన నేల కోసం కలిసి నడుద్దాం’-పవన్ కళ్యాణ్
అమరావతి: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా ‘సేనతో సేనాని-మన నేల కోసం కలిసి నడుద్దాం’ అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన నిర్వహించనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని తెలిపారు. మార్పు కోరుకుంటే రాదని,,మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుందని తెలిపారు. ఈ ప్రయత్నంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు QR కోడ్ స్కాన్ చేసి, లేదా లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

