రాష్ట్రంలో రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
జెన్-జీ కలల సాకారానికి కార్యాచరణ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిగా ఎంఎస్ఎంఈ రంగం ఉందని, భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్ఠ తీసుకువస్తే.. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు లక్షల మందికి జీవనోపాధిని కలిగిస్తాయన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. అంతకుముందు 4.4 ఎకరాల్లో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉంది. యువత కలలకు, మహిళ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఈ రంగం వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తోంది.
100 యూనికార్న్ లు:- “రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ కంపెనీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
జన్ జీ డ్రీమ్స్:-“మెటా, అమెజాన్ లాంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తుకు ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారుల్ని సృష్టిస్తాయి. మారుతున్న టెక్నాలజీ… ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తోంది. కార్యక్రమంలో భాగంగా సీఎం సమక్షంలో మెటా, అమెజాన్, జోహో సహా వివిధ సంస్థలతో ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఒప్పందం కుదుర్చుకుంది. డీప్ టెక్ స్టార్టప్ కంపెనీలకు రూ.20 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు సిడ్బీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు.

