‘కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు’-ఉప ముఖ్యమంత్రి
నిజాయతీగా కాలుష్య నివారణ పనులు చేద్దాం..
అమరావతి: ‘గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్ధాలు, జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి..? భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఉన్నత అధికారులు, తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను ‘కాలుష్యరహిత గోదావరి’ థీమ్ తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి జలాల కాలుష్యకారక ప్రాంతాలని పరిశీలించారు. పుష్కరాల్లో చేయాల్సిన పనుల తీరు, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికను స్వయంగా పరిశీలించారు. గోదావరి గట్ల సుందరీకరణ పనులు ఎంతవరకు వచ్చాయనేది, పుష్కరాల నేపథ్యంలో గట్లను ఎలా తీర్చిదిద్దబోతున్నది అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చింతలమ్మ ఘాట్ వద్ద నల్లా ఛానల్ ద్వారా రాజమహేంద్రవరం మురుగునీరు గోదావరిలోకి కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నది తీరంలో జరుగుతున్న కాలుష్యం తీరును స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సిబ్బందితో మాట్లాడి వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు.
నిధులను:- గోదావరి పుష్కరాలకు ఖర్చు చేసే ప్రతి పైసాను ప్రజలకు ఉపయోగపడే, గోదావరి నది తీరాన్ని కాపాడే మంచి పనులకు ఉపయోగించుకోవాలి. కేంద్ర జల శక్తి ద్వారా ఎన్.ఆర్. సి. పి. నిధులు రూ.416 కోట్లలో రూ.95 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. ఈ నిధులతో కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలి. పూర్తిస్థాయిలో మురుగు లేకుండా జలాలను గోదావరిలోకి విడిచిపెట్టి బాధ్యతను తీసుకోవాల”ని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కీర్తి చేకూరి,ఎస్పీ నరసింహ కిషోర్రు రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా,ఎమ్మేల్యే,మంత్రులు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

