పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు…ఉప ముఖ్యమంత్రి
కెమికల్ స్నానం చేయించకూడదు కదా…
అమరావతఇ:‘మా తెలుగుతల్లికి.. రాష్ట్ర గీతంలో గల గలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తాం.. ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ.. కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తోంది. ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా..? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యక్షంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్ర పేపర్ మిల్స్– కాలుష్య జలాలు:- రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ- ప్రత్యక్షంగా గోదావరిలోకి కాలుష్య జలాలు ఈ స్థాయిలో కలుస్తున్నా ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎందుకు స్పందించలేదని, కనీసం నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకర్ నాయక్ ను ప్రశ్నించారు.
ఘాట్స్ సుందరీకరణ, ముస్తాబు చేస్తే సరిపోతుందా? :- ఇక్కడ ఉన్న జలాలు చూశాక-పుణ్య స్నానానికి వస్తే రోగాలు వస్తాయి. ఘాట్స్ సుందరీకరణ, ముస్తాబు చేస్తే సరిపోతుందా? అక్కడ స్నానం చేసే నీళ్లు శుద్ధిగా ఉండవద్దా? ఎస్టీపీ ప్లాంట్స్ లో నిబంధనల ప్రకారం శుద్ధి చేస్తున్నారో లేదో చూడాలి. పుష్కరాల్లో పన్నీరు స్నానం చేయించక్కర్లేదు… కెమికల్ స్నానం చేయించకూడదు కదా. కాలుష్య నియంత్రణ విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు క్యాబినెట్ లో చర్చించి బలమైన నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు.ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ వెంట మంత్రలు,ఎమ్మేల్యేలు,అధికారులు వున్నారు.
