బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును అందుకున్న చంద్రబాబు
ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్..
సంస్కరణలే సంపద సృష్టికి పునాది..
అమరావతి : సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెప్పారు. ముంబైలో ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025 అవార్డును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని కోరుకుంటున్నాను.
ఫ్యూచర్ సిటీగా అమరావతి నిర్మాణం:- “ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ను ఏర్పాటు చేయగలిగాం. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కింది. ఫ్యూచర్ సిటీగా గ్రీన్, బ్లూ సిటీ, నెట్ జీరో కాన్సెప్టుతో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం. మన సమాజం కేవలం మిలియనీర్లు, బిలియనీర్ల కోసం మాత్రమే కాదు.

