మన సంస్కృతీ,సంప్రదాయాలకు ప్రతీక ఉగాది-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు కలెక్టరేట్లో ఉగాది వేడుకలు..
నెల్లూరు: ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన సంప్రదాయాల సుగంధాన్ని, మన సంస్కృతికి ఉన్న గొప్పతనాన్ని ప్రతిబింబించే పవిత్రమైన వేడుక అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు.గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పంచాంగ శ్రవణకర్త ఆలూరి శిరోమణి శర్మ పరాభవ ఉగాది నామ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు.
ఉగాది పచ్చడి సమతుల్య జీవన విధానాన్ని:- ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది కొత్త ప్రారంభాలకు సంకేతమని, పంచాంగ శ్రవణం భవిష్యత్తుపై ఆశలను నింపుతుందని తెలిపారు. ఉగాది పచ్చడి మనకు సమతుల్య జీవన విధానాన్ని నేర్పుతుందని అన్నారు. గత సంవత్సరం జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని, ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ సంవత్సరం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉగాదిని పురస్కరించుకుని దేవాదాయక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులను కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవులను, కళాకారులను, వివిధ రంగాల ప్రముఖులను గౌరవిస్తూ, ఘనంగా సత్కరించారు. తొలుత నిర్వహించిన కవి సమ్మేళనం, ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత కళాశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మహేశ్వరరెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, ఆర్డీవో అనూష, మెప్మా పీడీ లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

