తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అభివృద్ధి-ముఖ్యమంత్రి చంద్రబాబు
క్రీడలు, పర్యాటకానికి..
అమరావతి: తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో, రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియేట్, హెచ్వోడీ భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సీఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…‘రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి. మొత్తంగా 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు తెలుగు వైభవాన్ని చాటేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్ తదితర విభాగాలు వస్తాయి. పర్యాటకంతో పాటు నిత్యం రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకునే వాతావరణం ఉండేలా చూడాలి. హోటళ్లను ఏర్పాటు చేయాలి, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయాలి. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేయాలి. నీరుకొండలో చేపట్టే బోయే ప్రాజెక్టును అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
క్రీడా రంగం అతి పెద్ద ఆదాయ వనరు:- ఇదే విధంగా మరికొన్ని క్రీడలు కూడా కమర్షియలుగా టర్న్ అవుతాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇదే విధంగా రూపొందించాం. భవిష్యత్తులో క్రీడా రంగం అతి పెద్ద ఆదాయ వనరు కాబోతోందన్నారు. దీనికి బీసీసీఐ, ఐసీసీ సంస్థలే అతి పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు నిధుల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా క్రికెట్ బోర్డులు ఎదిగాయి. ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఓ పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మించాల్సిన అవసరం ఉంది”అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఎస్ సాయి ప్రసాద్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.

