ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ వర్గాలకు బుధవారం అధికారిక సమాచారం అందింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మొత్తం ఈ తీర్మానంపై సభ్యులు విస్తృతంగా చర్చ జరపనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడనున్నారు. ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

