బీహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్డ్ వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం
అమరావతి: బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించింది. రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, నవంబర్ 11వ తేదిన పోలింగ్ జరగనున్నదని,, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22వ తేది లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ తెలిపింది. ఇదే సమయంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు:- బిహార్లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందని సీఈసీ తెలిపింది. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. వీరిలో 14 లక్షల మంది కొత్త ఓటర్లని తెలిపింది. ఇక నుంచి EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని పేర్కొంది. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సారి ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడించింది.
నవంబర్ 6,,12 తేదిల్లో పోలింగ్:- బీహార్ మొదటి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10వ తేదిన వెలువడుతుందని,,నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 17,, నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 20వ తేదితో ముగుస్తుందన్నారు. నవంబర్ 6వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.2వ విడత ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13వ తేదిన విడుదల చేస్తామని,, నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20 అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23వ తేది వరకూ అవకాశం ఉంటుందని వెల్లడించారు. తుది దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11వ తేదిన జరుగుతుందని,, ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
కొత్తగా 17 సంస్కరణలు:- 85 ఏళ్ల పైబడిన ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నామని,, ఎలాంటి ఫిర్యాదుకైనా 1950 నెంబర్కు ఫోన్ చేసే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు తీసుకొస్తున్నామని కూడా వెల్లడించింది. ఈ సంస్కరణలను భవిష్యత్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నది.