సాగరంలో ప్రారంభం అయిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష
అమరావతి: విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. ప్రధానంగా ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశేష అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం తరపున గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, తూర్పు నౌకా దళ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాలు పాల్గొన్నారు. నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని రాష్ట్రపతి ముర్ము స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రయాణించారు. ఈ పరేడ్ లో రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాల నుంచి వచ్చినటువంటి మొత్తం 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన మరో 45 నౌకలు, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు,7 అంతర్జాతీయ యుద్ధనౌకలు సమీక్షలో పాల్గొన్నాయి.అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షలో భాగంగా ఆర్కేబీచ్ ప్రధాన కేంద్రంగా సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోలు జరిగాయి.

