భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం-ప్రధాని మోదీ
అమరావతి: భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే ఇజ్రాయెల్లో కూడా త్వరలో యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. పౌర అణు ఇంధనం, అంతరిక్ష విభాగాల్లోనూ భారత్, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తాయన్నారు. గురువారం మధ్యాహ్నం జెరూసలెంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పై వివరాలను మోదీ ప్రకటించారు.
27 రంగాల్లో పరస్పర సహకారం:- ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి టెక్నాలజీలలో ఇరుదేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. భవిష్యత్ వ్యవసాయ అవసరాలను తీర్చగల కొత్త టెక్నాలజీలనూ సంయుక్తంగా అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్, ఇజ్రాయెల్లలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ లను క్రియేట్ చేయడంపైనా ఫోకస్ పెడతామన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ రంగంలోనూ ఇరుదేశాలు సహకరించుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. రక్షణ రంగంలో గత సంవత్సరం ఇరుదేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (MoU) సరికొత్త దిశను చూపిస్తుందనే ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. మొత్తం 27 రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. గాజాపై ప్రధాని మోదీ మరోసారి భారత్ వైఖరిని స్పష్టం చేశారు. మానవత్వం ఎప్పుడూ సంఘర్షణకు బలికాకూడదని అన్నారు. ప్రస్తుతం శాంతి ప్రణాళిక ద్వారా ఓ ముందడుగు పడిందని, ఈ ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు

