రైతుల కోసం డిజిటల్ సేవలను అందించే “భారత్ విస్తార్” పథకం-మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
అమరావతి: దేశంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక డిజిటల్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది. మంగళవారం జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జైపూర్లోని దుర్గాపురలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో “భారత్ విస్తార్” అనే (AI) కృత్రిమ మేధస్సు ఆధారిత ఫ్లాట్ఫామ్ను ప్రారంభించారు. దీని ద్వారా రైతులు తమకు అవసరమైన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.
వ్యవసాయంతో పాటు పశు పోషణ దిశగా:- ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో ఇదొక చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. ఈ సేవల ద్వారా రైతులు ఒక్క ఫోన్ కాల్తో ఏ సమాచారాన్ని అయినా తెలుసుకోవచ్చు. పంట ఆధారిత శాస్త్రీయ సలహాలు, ధరల వివరాలు, వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. డిజిటల్ ఇండియా ఫలితాలను గ్రామీణ ప్రాంతాలను విస్తరంచడంలో ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుందని కేంద్రం మంత్రి తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయంతో పాటు పశు పోషణ దిశగా రైతులను ముందుకు నడిపించడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడనుందని పేర్కొన్నారు. రైతులు ఈ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా లబ్ది పొందాలని సూచించారు. రైతులు తమ సొంత భాషలోనే ఈ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఫ్లాట్ఫామ్పై సేవలు పొందవచ్చు.

