విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం- కమిషనర్ నందన్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసి, విజయదశమి నాటికి బి, సి కేటగిరీల డబల్ బెడ్ రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు.సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాలవల్ల లబ్ధిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటికోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. అనుమతులు లేని భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 13 భవనాల నుంచి అపరాధ రుసుమును వసూలు చేశామని కమిషనర్ వెల్లడించారు. అనుమతులు లేని నిర్మాణాలు, అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
కంట్రోల్ విభాగంలో హెల్ప్ లైన్:- నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను 94940 18118 నెంబరుకు వాట్సప్ ద్వారా లేదా 1800 425 1113 టోల్ ఫ్రీ నెంబరు కు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల లోపు తెలియజేయాలని కోరారు.
మొత్తం 55 అర్జీలు:- విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ 3, ఆప్కాస్ 3, ఇంజనీరింగ్ 11, టిడ్కో హౌసింగ్ 20, రెవెన్యూ 7, టౌన్ ప్లానింగ్ 7, పబ్లిక్ హెల్త్ 4, మొత్తం 55 అర్జీలను కమిషనర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్నారు. నిర్దేశించిన సమయంలోపు సమస్యలన్నిటిని పరిష్కరించాలని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సెక్రటరీ శ్రీలక్ష్మి,మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

