కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా సర్వతోముఖాభివృద్ధి-ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేలా జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విస్తృత అవగాహన కల్పించాలని నెల్లూరు ఎం.పి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో పదిలక్షల విలువైన డ్రోన్ పరికరాల కొనుగోలుకు కూడా కేంద్రప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. పెద్దఎత్తున జాతీయరహదారులకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనకు ఎటువంటి గ్యారంటీలు లేకుండా రూ.2కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశం కేంద్రప్రభుత్వం కల్పించిందన్నారు. పిఎం విశ్వకర్మ ద్వారా చేతివృత్తులకు రుణాలు మంజూరు చేస్తూ ఆయా వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగ్రామిగా నిలపడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు.
కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ జిల్లాలో అధికంగా ఉత్పత్తి అయ్యే వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా విలువ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే గృహ నిర్మాణాల్లో గుర్తించిన లోపాలపై ఇప్పటికే పునర్నిర్మాణం, మరమ్మతు పనులు ప్రారంభించామని చెప్పారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు,ఎమ్మేల్యే సోమిరెడ్డి,ఎమ్మేల్సీలు,జడ్పీ ఛైర్మన్, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

