రిపేర్, రెనోవెషన్, రెస్టోరేషన్ ద్వారా 26,928 హెక్టార్ల ఆయకట్టు-కలెక్టర్
నెల్లూరు: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న RRR (రిపేర్, రెనోవెషన్, రెస్టోరేషన్) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పంటలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు, నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భజలాలు పెంచడమే ఆర్ ఆర్ ఆర్ స్కీం ప్రధాన లక్ష్యంగా చెప్పారు.
220 మైనర్ ఇరిగేషన్ చెరువులు:- డ్వామా, భూగర్భజల, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా రూ.35,519.56 లక్షల అంచనా వ్యయంతో జిల్లాలో ప్రతిపాదించిన 220 మైనర్ ఇరిగేషన్ చెరువులను క్షుణ్ణంగా పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ స్కీం ద్వారా సుమారు 26,928 హెక్టార్ల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుందని కలెక్టర్ చెప్పారు. చెరువులను అభివృద్ధి చేసిన తరువాత ఉపాధిహామీ పథకం ద్వారా ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్ మొదలైన పనులను చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. గ్రౌండ్వాటర్ అధికారులు అవరసమైన సాంకేతిక సహాయాన్ని అందించాలన్నారు. జిల్లాలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలుచేసి రైతులకు మేలు జరిగేలా, నీటి సామర్థ్యం, భూగర్భజలాల పెంపు పెరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు.
శాస్త్రవేత్త పెరిక యాదయ్య:- తొలుత ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ ఆర్ఆర్ఆర్ స్కీం ద్వారా చేపట్టాల్సిన చెరువులు, కాలువలు, చెక్డ్యాంల బలోపేతం, మరమ్మతు పనులు చేపట్టడం, నీటిపారుదల అవకాశాలను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో కేంద్రప్రభుత్వ భూగర్భజల విభాగం శాస్త్రవేత్త పెరిక యాదయ్య డ్వామా పీడీ గంగాభవాని, భూగర్భజల డిప్యూటీ డైరెక్టర్ శోభన్బాబు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ విజయభాస్కర్, ఇరిగేషన్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.