కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ-మంత్రి లోకేష్
అమరావతి: నాడు, నేడూ, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుని కుమారుడు భానుచందర్ చిత్రపటాలకు పూలదండ వేసి మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీకే బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు.
ఇది మాకో పరీక్ష, కుటుంబానికో పరీక్ష. మాకు దేవుడు జయించే శక్తి ఇచ్చాడు. సుబ్బానాయుడు కుటుంబానికి అండగా నిలబడటమే కాదు.. కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తా. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. అన్నీ గమనిస్తున్నాం. దీనివెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కుటుంబానికి అండగా నిలబడతాం. రాజకీయంగా పైకి తీసుకువచ్చే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని చెప్పారు.

