బంగాళాఖాతంలో ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండం-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం నాటికి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శని వారాల్లో భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతి భారీవర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

