అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్-పవన్ కళ్యాణ్
పిఠాపురంలో శక్తి పీఠం..
రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు..
అమరావతి: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది.
ఆధ్యాత్మికం కేంద్రం పిఠాపురం:- జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.
ప్రత్యేక సౌకర్యాలు:- పవన్ కళ్యాణ్ అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కి, పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

