AP&TG

సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ-సిఎం చంద్రబాబు

అమరావతి: ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని,మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్లు:- సోమవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆబ్కారీ శాఖపై రివ్యూ చేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో,సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉంది. అధికారులు సీఎంకు కొత్త పాలసీపై ప్రతిపాదనలు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చింది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్ కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. లిక్కర్ షాపుల్లో ఎలా అయితే 10 శాతం వారికి ఇచ్చారో… అదే విధంగా బార్లలో కూడా ఆ వర్గాలకు బార్లు కేటాయించనున్నారు.

ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా:- ఇప్పుడు 12 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటించామని,ఈ నెలలో మరో 8 జిల్లాలను ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ (ఐడి లిక్కర్) ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 6 జిల్లాలను కూడా ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *