రేపు అండమాన్ లో అల్పపీడనం-భారీ వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.4వ తేదీన బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

